సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన
హైదరాబాద్ | NTODAY NEWS
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం హైదరాబాద్లోని సంక్షేమ బోర్డు రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ, సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని ఆరోపించారు.
ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో రూ.346 కోట్లు, సీఎస్సీ హెల్త్ చెకప్ కార్యక్రమాల పేరుతో రూ.750 కోట్లు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఈ నిధులు పూర్తిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికే వినియోగించాల్సి ఉండగా, ఇతరత్రా ఖర్చు చేయడం సరికాదన్నారు.
ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఏడాది సుమారు రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన నిధులు వినియోగించకుండా ఉంచాయని ఆరోపించారు. కార్మికుల డబ్బులు కార్మికులకే ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, సంక్షేమ బోర్డు నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని కోరుతూ, డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు మల్లేష్, వెంకన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.