ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
ముద్దనూరు: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎట్టకేలకు కడప జిల్లా పులివెందులకు రైల్వే ప్రాజెక్టు రానుంది. కడప–బెంగళూరు రైల్వే మార్గాన్ని పులివెందుల మీదుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రాంతాల మీదుగా సుమారు 110 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2,505.89 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదిత మార్గంలో ముద్దనూరు, చిన్నదుద్యాల, మల్లెల, మాడూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ముదిగుబ్బ వైపు కూడా రెండు స్టేషన్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రైల్వే లైన్ పూర్తయితే కడప జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు పులివెందుల, ముద్దనూరు పరిసర ప్రాంతాల ప్రజలకు రైలు రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ఇదిలా ఉండగా ఓబులవారిపల్లె–గుంతకల్లు మధ్య మరో రెండు లైన్ల నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓబులవారిపల్లె–రేణిగుంట మధ్య రెండు రైల్వే లైన్లు ఉండగా, మూడో లైన్ నిర్మాణానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తదుపరి కార్యాచరణపై ఉన్నతాధికారుల నుంచి త్వరలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.