అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
జీతాల కోతను ఎత్తివేయాలి.. సేవలను క్రమబద్ధీకరించాలని ఉద్యోగుల డిమాండ్
అనకాపల్లి | Ntoday News
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (కన్సాలిడేటెడ్) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించిన జీతాలను వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు. అలాగే కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ అనుమతితో 2014లో బోర్డు ద్వారా చేసిన తీర్మానాన్ని అమలు చేసి, దాని ప్రకారం ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. గత 20 నుంచి 35 సంవత్సరాలుగా సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగుల సుదీర్ఘ సేవలను పరిగణనలోకి తీసుకుని వారికి తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రమాదకరమైన విద్యుత్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అవసరమైన ఇన్సూరెన్స్, రక్షణ మరియు భద్రతా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
తగ్గించిన జీతాలను తిరిగి చెల్లించే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు.