స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ జమలాపురం కేశవరావు జయంతి వేడుకలు ఘనంగా
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ జమలాపురం కేశవరావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కేశవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన దేశ సేవలను వక్తలు కొనియాడారు.
జమలాపురం కేశవరావు 1908 సెప్టెంబర్ 3న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో వెంకట రామారావు, వెంకట నరసమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారని పేర్కొన్నారు. కళాశాలలో వందేమాతరం గీతాలాపనను నిషేధించడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపట్టారని, దీంతో నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చిందని వివరించారు.
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ విమోచనోద్యమంలోనూ చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించిన గొప్ప దేశభక్తుడని వక్తలు పేర్కొన్నారు. ప్రజల కోసం జీవిస్తూ అన్యాయాలను ఎదిరించేందుకు ప్రజల్లో ధైర్యసాహసాలు నూరిపోసిన ఆయనను ప్రజలు అభిమానంతో ‘సర్దార్’ అని పిలిచేవారని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది రోజుల ముందు 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహంలో కేశవరావు కీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ ఉద్యమానికి బాధ్యుడిగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రెండేళ్ల కారాగార శిక్ష విధించిందని వివరించారు.
అంటరానితనం నిర్మూలన, ఆదివాసీల అభివృద్ధి, తెలంగాణలో గ్రంథాలయాల స్థాపనకు కేశవరావు విశేష కృషి చేశారని కొనియాడారు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన అనంతరం 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారని తెలిపారు. అనారోగ్యంతో 1953 మార్చి 29న 45 ఏళ్ల వయసులోనే కన్నుమూశారని పేర్కొన్నారు.
కేశవరావు వీర చరిత్రను నేటికీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుర్రకథలు, నాటకాల రూపంలో ప్రదర్శిస్తున్నారని వక్తలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, సాయిబాబా యువజన కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ, మహిళా సభ్యులు దేవర అంజలి, ఇనపనూరి శిరీష, అంగన్వాడీ చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.