వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం
రైతాంగానికి సాగునీరు అందించిన ‘అపర భగీరథుడు’ వైఎస్సార్: చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం | Ntoday News
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేసి, పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ రైతులు, పేదలు, సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ తర్వాత గోదావరి ప్రాంత అభివృద్ధి, సాగునీటి రంగంపై అంతటి దృష్టి సారించిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు.
వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ద్వారా భారీగా నిధులు కేటాయించి లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు. కోనసీమ ప్రాంతంలో గోదావరి వరదల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఏటిగట్ల బలోపేతానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
కొత్తపేట నియోజకవర్గంలోనూ సుమారు రూ.100 కోట్లతో ఏటిగట్లను బలోపేతం చేసి ప్రజలకు వరద భయాన్ని దూరం చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పోలవరం, వెలుగొండ వంటి కీలక ప్రాజెక్టులకు వైఎస్సార్ హయాంలోనే పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు.
వైఎస్సార్ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనూ అనేక ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు పడ్డాయని చెప్పారు.
అయితే ఇతర ప్రభుత్వాలు లేదా నాయకులు ప్రారంభించిన పనులకు పేర్లు మార్చి, చివర్లో రిబ్బన్ కట్ చేసి మొత్తం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడం సరైన పద్ధతి కాదని చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. అభివృద్ధి పనుల వాస్తవ చరిత్రను ప్రజలు తెలుసుకుంటున్నారని, పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు యూరియా, రైతులకు ఇచ్చిన ఆర్థిక హామీలు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
రైతులకు సాగునీరు, పేదలకు సంక్షేమం, ప్రజలకు భరోసా కల్పించిన వైఎస్సార్ను ఆయన వర్ధంతి సందర్భంగా జలాభిషేకంతో స్మరించుకోవడం గర్వకారణమని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.