విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి
కదిరి మున్సిపల్ హైస్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
కదిరి | Ntoday News
కదిరి పట్టణంలోని మగ్గల క్వార్టర్స్లో ఉన్న మున్సిపల్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై సోషల్ ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని AISP, PSFI, NSUI నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
విద్యార్థి సంఘాల కథనం ప్రకారం.. విద్యార్థులకు ఎత్తు కొలిచే విధానం చెప్పే క్రమంలో సోషల్ ఉపాధ్యాయురాలు విద్యార్థి షేక్ అల్తాఫ్ను ఎత్తు కొలవాలని సూచించగా, తనకు కొలవడం రాదని విద్యార్థి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు విద్యార్థిని కొట్టడంతో తలకు గాయం కాగా రక్తస్రావం జరిగినట్లు వారు ఆరోపించారు.
అనంతరం విద్యార్థిని భయపెట్టి ఇంట్లో జరిగిన విషయం చెప్పవద్దని హెచ్చరించి ఇంటికి పంపించినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం తల నొప్పి తీవ్రం కావడంతో విద్యార్థి తన అన్నకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా PSFI రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్, AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ, NSUI జిల్లా నాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన పాఠశాలలోనే చిన్నారిపై దాడి జరగడం ఆందోళనకరమన్నారు. విద్యార్థికి గాయం అయినప్పటికీ బాధ్యత వహించకుండా భయపెట్టి ఇంటికి పంపించడం సరికాదని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యురాలైన ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు కదిరి మండల విద్యాశాఖ అధికారి (MEO)కు వినతిపత్రం అందజేసి ఘటన వివరాలను తెలియజేశారు. దీనిపై స్పందించిన MEO ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.