గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
మదనపల్లె | Ntoday News
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, దొంగతనాల నివారణ తదితర అంశాలపై గ్రామస్తులకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.