లేని ఆస్తుల రిజిస్ట్రేషన్.. రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం
చంపాపేట సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్.. స్కామ్లో 29 మంది పాత్ర ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్ | Ntoday News
లేని ఆస్తులను కాగితాలపై ఉన్నట్లుగా చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన కేసులో చంపాపేట సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నకిలీ ఆస్తులను చూపించి బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా.. గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో యూసుఫ్ ఉర్ రెహ్మాన్ ఉనికిలో లేని 11 ఆస్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలినట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో మొత్తం 29 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా చంపాపేట సబ్ రిజిస్ట్రార్ను కూడా అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.
ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? లేని ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇంకా ఎన్ని లావాదేవీలు జరిగాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.