పెనుగొలను మాజీ సహకార సంఘం అధ్యక్షులు కొత్తూరు గురునాథం మృతి
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన సహకార సంఘం మాజీ అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నాయకులు కొత్తూరు గురునాథం అనారోగ్యంతో గురువారం రాత్రి హైదరాబాద్లో మృతి చెందారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు.
గ్రామంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గురునాథం నాయకత్వం వహించారని గ్రామస్థులు తెలిపారు. రైతులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందించేవారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేసుకున్నారు.
కొత్తూరు గురునాథం మృతి పట్ల షిరిడీ సాయిబాబా కమిటీ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.