ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
గుంటూరు బస్టాండ్లో ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీలు
గుంటూరు | Ntoday News
గుంటూరు బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులను వేగవంతం చేయాలని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్లో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పలు అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బస్టాండ్లోని దుకాణాల్లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
బస్టాండ్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, ప్రయాణికుల సౌకర్యాలు, బస్టాండ్ పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అదేవిధంగా గుంటూరులో చేపడుతున్న ఎలక్ట్రిక్ బస్ డిపో నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు.