నేడు, రేపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇవాళ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్సీ గురుకుల నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం దౌల్తాబాద్లోని బీసీ గురుకులం, జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించనున్నారు.
సాయంత్రం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్లో కొనసాగుతున్న పనులు, అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
అనంతరం కొడంగల్లోని తన నివాసానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు.