గంపలగూడెం: నేత్రదానం.. మానవత్వానికి మహోన్నత సేవ
గంపలగూడెం, సెప్టెంబర్ 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం గ్రామానికి చెందిన యడ్ల వెంకాయమ్మ (72) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు చూపిన మానవత్వం అభినందనీయంగా నిలిచింది.
లయన్స్ క్లబ్ ప్రతినిధి, న్యాయవాది గోగిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానం చేయాలని కోరారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, విజయవాడ వైద్య బృందం సాంకేతిక పరిజ్ఞానంతో మృతురాలి కార్నియాలను సేకరించింది. నేత్రదానం ద్వారా చూపు కోల్పోయిన వారికి వెలుగును అందించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ నేత్రదాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నాగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మృతురాలు వెంకాయమ్మకు భర్త యడ్ల వెంకటేశ్వరరావుతో పాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.