ఎర్రగుంటపల్లి: మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నేతల పరామర్శ
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తడికమళ్ల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రెటరీ ఉన్నమట్ల ఎలిజా, చింతలపూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగ్గవరపు కోటిరెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ గార్లపాటి మురళి, తానంకి రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాధారణ వరలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా సుబ్బారావు, చింతలపూడి మండల పట్టణ అధ్యక్షులు సందిపం సుందరం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వెంకటేశ్వరరావుకు నివాళులర్పించారు.