మూడు మంత్రి పదవులు.. భారీగా ఆశావహులు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఇటీవల కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో మరో స్థానం ఖాళీ అయింది. దీంతో మొత్తం మూడు మంత్రి పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రి పదవుల రేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బాలు నాయక్, రాంచందర్ నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియార్టీతో పాటు మహిళా ప్రాతినిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆశావహుల బలాబలాలు, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, పార్టీకి వారి సేవలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మూడు ఖాళీలకు పలువురు నేతలు పోటీ పడుతుండటంతో మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.