ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి పునాది: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి పునాది: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరుపేట: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడమే ప్రజాస్వామ్యానికి మూల సూత్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, వారి కుటుంబ సభ్యులతో సోమవారం మాటూరుపేటలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేశారని ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలో కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చర్యల ద్వారా రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చివరికి పౌరసత్వం కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరికీ కాపాడే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని స్పష్టం చేశారు.
నెల రోజులుగా సొంత వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలను పక్కనపెట్టి సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న బీఎల్ఏలను, వారికి అండగా నిలిచిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి బీఎల్ఏ కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని, వారి పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మధిర నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 10 శాతంలో మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల గుర్తింపు వంటి పనులను బూత్ల వారీగా పూర్తి చేసి, ఓటర్ల నమోదు ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్న పీసీసీ ప్రతినిధులను అభినందిస్తూ, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.