మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు
మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి
హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.
మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ జిందాబాద్, సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కులో మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. నితీష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్న హైదరాబాద్ జిందాబాద్ ను అభినందించారు.
హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో వైభవంగా నిర్వహించుకొనే “వినాయక చవితి” పండుగ సందర్భంగా అందరూ ఇండ్లలోనూ, అపార్ట్మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని అన్నారు. నగరంలో ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, మరింతగా పెరగకుండా ఉండటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. గౌరవ హైకోర్టు “ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకుండా చూడాలని” సూచించిందని అన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం అని అన్నారు.
వినాయక విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని చెప్పారు. పర్యావరణ వేత్తల లెక్కల ప్రకారం నిమజ్జనం సమయంలో ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్లో 8,000 నుండి 9,000 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, పాదరసం, సీసం, నిహాల్, టర్పెంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయని కె. వీరయ్య అన్నారు. ఈ విష రసాయనాలు హుస్సేన్సాగర్ మరియు చెరువులలో కలవటం వలన కాలుష్య సాగరాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 10 సంవత్సరాల నుండి హైదరాబాద్ జిందాబాద్ (హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం) ఆధ్వర్యంలో హెచఎండిఏ సహకారంతో గ్రేటర్లోని 45 కాలనీలలో, అపార్ట్మెంట్లలో మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నామని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను భక్తితో అందరం పూజిద్దాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దశరథ్, 2027 గవర్నర్ శైలజ మోహన్, ఏవిపీ సంపత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు పాండవుల నాగేశ్వరరావు, పి శ్రీనివాసరావు, నాగేష్, సంగీత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.