రెండు కాలనీలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మించాలని వినతి
రెండు కాలనీలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మించాలని వినతి
చింతలపూడి: పట్టణంలోని సుప్రియన్ పేటలో మంజూరైన సీసీ రహదారిని ప్రజలకు ఉపయోగపడే మార్గంలో నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సుప్రియన్ పేటలో సుమారు 200 మీటర్ల మేర సీసీ రహదారి నిర్మాణానికి మంజూరు కాగా, అందులో 40 మీటర్ల రహదారిని ప్రజలు నివాసం ఉండని ప్రాంతంలో నిర్మించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సుప్రియన్ పేట, బట్టువారిగూడెం కాలనీలను కలుపుతూ రెండు ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరే మార్గంలో రహదారి నిర్మించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పట్టుమని నాలుగు ఇళ్లు కూడా లేని ప్రాంతంలో 40 మీటర్ల సీసీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే మార్గంలోనే రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
సుప్రియన్ పేట, బట్టువారిగూడెం ప్రాంతాల ప్రజలు సచివాలయానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని స్థానికులు తెలిపారు. రెండు కాలనీలను అనుసంధానించేలా రహదారి నిర్మిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ప్రజలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.