రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు
బిల్లులు, రికార్డులపై అధికారుల ఫోకస్.. మూడు రోజుల పాటు కొనసాగనున్న పరిశీలన
రావులపాలెం | Ntoday News
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామపంచాయతీలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని వివిధ రికార్డులు, బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు.
రాజమండ్రి ఏసీబీ ఇన్స్పెక్టర్ భవాని కిషోర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 84 కాంట్రాక్ట్ బిల్లింగ్ అంశాలు, 61 లేఖలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు, రికార్డుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తనిఖీల ప్రక్రియ మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం ఏసీబీ అధికారులు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.