చిన్నంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన
.చిన్నంపేటలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, అత్యవసర సేవలు, నూతన చట్టాలపై పోలీసులు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ సూచనలతో, నూజివీడు గ్రామీణ సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలు, లాటరీ పేరుతో జరిగే మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బును నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
పిల్లల రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం 1098 బాలల సహాయవాణి నంబర్ను వినియోగించుకోవచ్చని విద్యార్థులకు తెలిపారు. దేశంలో అమల్లోకి వచ్చిన నూతన చట్టాలు, పౌరుల హక్కులు, బాధ్యతల గురించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని ఎస్సై రామకృష్ణ సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థుల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.