గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
నేడు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
గురువారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం అగ్నికణంలా రగిలి మహత్తర ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. ఈ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరవీరుల త్యాగాలతో చరిత్ర సృష్టించబడిందని తెలిపారు.
సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
భూమి కోసం, భుక్తి కోసం దొరలు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్కుమార్ పిలుపునిచ్చారు
దొరలు, భూస్వాముల ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి దక్కుతుందని అన్నారు. సెప్టెంబర్ 17 పేరుతో సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకునే కార్యక్రమాల ముసుగులో చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను మరుగునపరిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాయుధ పోరాట చరిత్రకు నిలయమైన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం 11వ తేదీన వారోత్సవాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి సీమ అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కార్యదర్శి ఎం.డి. అక్బర్, గీత కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి బొడిగె సైదులు, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, గ్రామ శాఖ కార్యదర్శి జిల్లా సత్యం, సీనియర్ నాయకులు బొబ్బిల శంకర్రెడ్డి, బొడిగె బక్కశెట్టి, ఎర్పుల రాములు, కోయగూర మారయ్య, కసర్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.