ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం: కేయూ వీసీ ఆచార్య కే. ప్రతాప్రెడ్డి
వరంగల్ | Ntoday News
భూమి కోసం దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
విద్యార్థులు చాకలి ఐలమ్మ జీవితాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రిజిస్ట్రార్ సూచించారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పాటుపడేలా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.