మహిళా సంఘాలకు అదనపు ఆదాయం.. విజయ డెయిరీ పార్లర్లు
హైదరాబాద్: మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహిస్తున్న 221 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తొలి దశలో 96 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మిగిలిన క్యాంటీన్లకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షల వ్యయం అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మొత్తాన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రుణ రూపంలో అందించనున్నారు. మహిళా సంఘాల సభ్యులు పార్లర్లలో విజయ డెయిరీకి చెందిన పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. తద్వారా క్యాంటీన్ నిర్వహణతో పాటు డెయిరీ ఉత్పత్తుల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు