గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
డిజేలపై సంపూర్ణ నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు
సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు
పోలీస్ ప్రధాన కార్యాలయం:
సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాలు, కేసుల పురోగతిపై ఆయన సమగ్ర సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టుల్లో శిక్షల శాతాన్ని (Conviction Rate) పెంచాలని ఆదేశించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సకాలంలో చార్జ్షీట్లు దాఖలు చేయాలన్నారు. నేరాల అదుపునకు గాను గ్రామాల్లో, పట్టణాల్లో వ్యాపారులు, ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు:
ఈ నెల 14 నుండి ప్రారంభంకానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద డిజేలు, అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్లపై పూర్తి నిషేధం ఉందన్నారు. నిబంధనలు మీరితే నిర్వాహకులు, డిజే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శోభాయాత్ర, నిమజ్జనం వేళ క్రేన్లు, లైటింగ్, స్విమ్మర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
అనంతరం ఈ నెలవారీ సమీక్షలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులు, సిబ్బందికి ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాలను అందజేశారు.