నూతన విద్యా సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి: అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
జైపూర్: 2026-27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను విద్యార్థులకు పంపిణీ చేసి, నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యను జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావించి, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్యను, ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పోటీ ప్రపంచంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు పాఠశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా గది తదితర మౌలిక వసతులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్లి పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ విజ్ఞానం, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత చరిత్రలు, సాహిత్య పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు. విద్యా సంవత్సరపు మొదటి రోజు నుంచే క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించడంతో పాటు క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు