ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్ సమీకృత కలెక్టరేట్లో అర్జీల స్వీకరణ
అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఆర్ఓ మోతిరామ్లతో కలిసి సమస్యల పరిశీలన
ఇండ్లు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు
మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్లతో కలిసి ఆయన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు సత్వరమే న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. చెన్నూర్ మండలం ఒతుకులపల్లికి చెందిన కావేరి శోభ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాలకు చెందిన సెగ్గెం ప్రసాద్ జీవనాధారంగా ఆటోతో పాటు రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలని కోరారు. తాండూరు మండలం అచలాపూర్లో అక్రమ కల్వర్టు నిర్మాణంతో తమ భూమి ఆక్రమణకు గురవుతుందని కట్ల పోసక్క, కట్ల పోచం ఫిర్యాదు చేయగా.. లక్షెట్టిపేట మండలం మోదెలలో గోదావరి ముంపునకు గురైన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని సత్యనారాయణ రావు అర్జీ సమర్పించారు. అలాగే, దేవాపూర్కు చెందిన వెంకటేశం తన కుమారుడికి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో సీటు కేటాయించాలని, జైపూర్ మండలం ఇందారానికి చెందిన కళ్యాణి తనకు గృహజ్యోతి, గ్యాస్ రాయితీ పథకాలు వర్తింపజేయాలని వినతిపత్రాలు అందజేశారు