చెరువుగట్టులో మహిళపై కత్తితో దాడి..
కుండల విక్రయం వివాదం ప్రధాన కారణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు దేవస్థానం వద్ద కుండల విక్రయం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, కత్తితో దాడి చేసేవరకు వెళ్ళింది. ఈ ఘటనపై నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి కులానికి చెందిన సుమారు 40 కుటుంబాలు చెరువుగట్టు దేవస్థానం వద్ద సంప్రదాయ పద్ధతిలో వంతుల వారీగా కుండలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన బొడ్డుపల్లి జ్యోతి (27) తన వంతు ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి చెరువుగట్టు వద్ద కుండలు విక్రయిస్తోంది. ఆ సమయంలో నల్లగొండకు చెందిన శేషరాజుల సునీత (37) కూడా అక్కడ కుండలు విక్రయించడాన్ని జ్యోతి గమనించి ప్రశ్నించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శేషరాజుల సునీత దుర్భాషలాడుతూ, తన వద్ద ఉన్న కత్తితో బొడ్డుపల్లి జ్యోతిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో జ్యోతి చేతికి లోతైన గాయమైంది. అక్కడ ఉన్న ఇతర మహిళలు అడ్డుకోబోగా, సునీత వారిపై కూడా కత్తితో దాడికి పాల్పడింది. ఈ క్రమంలో బొడ్డుపల్లి భవాని అనే మహిళకు రెండు చేతుల మణికట్టు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా బాధితుల చేతులను సునీత కొరికినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు లో
గతంలో కూడా శేషరాజుల సునీత, ఎల్లారెడ్డిగూడెంకు చెందిన బొడ్డుపల్లి శంకర్ అనే వ్యక్తి సహకారంతో పలుమార్లు ఇక్కడ గొడవలకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. బాధితురాలైన బొడ్డుపల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయని ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.