ఎస్ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
ప్రత్యేక సారాంశ సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొనే అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఈఆర్వో మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియపై శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేసి, బి ఎల్ వోలు మరియు బిఎల్ ఏలకు శిక్షణను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ విధానాలు, షెడ్యూల్ తదితర అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యక్రమాలు కొనసాగనున్నాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జరగనుందని పేర్కొన్నారు. వాటి పరిశీలన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో చోటు పొందేలా చూడటంతో పాటు, మృతులు, అనర్హులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రతి ఇంటిని సందర్శించి ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల సహకారంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఈఆర్వోలు కె. సంజయ్ రత్న కుమార్, కె. ప్రభుదాస్, పి సత్యకుమారి, రాంబాబు,, సెంట్రల్ నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శేషం సురేష్, బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగర పాలక సంస్థ