ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం-1 వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం మానుకుని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతం పెరగడంతో పాటు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎమ్టీ కన్నమ్మ, ఐసీఆర్పీలు మాధవి, నాగమణి, చక్రధర్ రైతులకు నవధాన్యాల పచ్చిరొట్ట ఎరువు ఉపయోగాలపై వివరించారు. ఒకే రకం పచ్చిరొట్ట ఎరువుకంటే వివిధ రకాల చిరుధాన్యాలను కలిపి వాడడం వల్ల పైరుకు నత్రజని, భాస్వరం తో పాటు సూక్ష్మపోషకాలు కూడా అందుతాయని తెలిపారు.
అవసరమైన రైతులకు 10 కిలోల చొప్పున రూ.1000కు సరఫరా చేస్తామని చెప్పారు. 18 రకాల ధాన్యాలతో తయారుచేసిన పచ్చిరొట్ట ఎరువు వాడకం ఎంతో ప్రయోజనకరమని మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, కళ్ళేపల్లి మారేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.