జూలై 13 నుంచి సీపీఐ ఉద్యమ నిధి సేకరణ కార్యక్రమం
జూలై 30న ఏలూరు ఏరియా జనరల్ బాడీ సమావేశం
ఏలూరు: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో జూలై 13 నుంచి 30వ తేదీ వరకు ఉద్యమ నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ ప్రకటించారు. ప్రజలందరూ విరివిగా విరాళాలు అందించి ఉద్యమాలకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్లో అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా అధ్యక్షతన జరిగిన సీపీఐ ఏలూరు ఏరియా సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని విమర్శించారు.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఏడాది కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించారు. నల్లధనం నిర్మూలన, ఉగ్రవాద నిర్మూలన పేరుతో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని పేర్కొన్నారు.
దేశ రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు చేసిన ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు అవసరమని అన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ చేపడుతున్న ఉద్యమాలకు ఆర్థిక సహకారం అందించాలని, జూలై 13 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తామని తెలిపారు.
సీపీఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ, ఈ నెల 30న ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్లో సీపీఐ ఏలూరు ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారని, పార్టీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, ఉప్పులూరి లక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.