రిజిస్ట్రేషన్లలో భారీ సంస్కరణలు.. దళారుల దందాకు చెక్..!
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు.. రూ.2 వేలకే డాక్యుమెంట్ తయారీ
అమరావతి, జూలై 4: రాష్ట్రంలో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రజలకు మరింత సులభతరంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులు, దళారుల జోక్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కేలు) ఏర్పాటు చేయనుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అవినీతి రహిత సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లోనే దస్తావేజుల తయారీ, ఫీజుల చెల్లింపులు, ముందస్తు స్లాట్ బుకింగ్, కేవైసీ ప్రక్రియ వంటి అన్ని సేవలు ఒకేచోట అందుబాటులో ఉండనున్నాయి. పబ్లిక్ డాక్యుమెంట్ సిస్టమ్ ద్వారా మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. కేవైసీ పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఈ కేంద్రాలు నిర్వహించబడనున్నాయి. దస్తావేజుల తయారీకి కేవలం రూ.2 వేల సేవా రుసుము మాత్రమే నిర్ణయించారు. ఈ విధానం అమల్లోకి వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థకు గట్టి చెక్ పడటంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ సంస్కరణలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి తగ్గడంతో పాటు ప్రజల సమయం, డబ్బు రెండూ ఆదా కానున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.