పెళ్లి వేడుకలో రూ.5.60 లక్షలు చోరీ.. గడ్డి వాములో దాచిన నిందితుడు అరెస్ట్
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నగదు చోరీ ఘటన కలకలం రేపింది. పెళ్లికి హాజరైన సుర్ల రజిని అనే మహిళ వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్ను పైల చిట్టిబాబు అనే యువకుడు అపహరించాడు. ఆ బ్యాగులో దాదాపు రూ.5.60 లక్షల నగదు, చిన్న బంగారు లాకెట్ ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కేవలం మూడు గంటల్లోనే నిందితుడు పైల చిట్టిబాబును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు దొంగిలించిన నగదు బ్యాగ్ను గ్రామంలోని గడ్డి వాములో దాచినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిందితుడు డెక్కన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.32 వేల జీతం పొందుతున్నాడని తెలిపారు. అయితే మద్యానికి బానిస కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి పోలీసు కేసులు నమోదు కాలేదని, అయితే గతంలోనూ ఒకసారి దొంగతనం చేసి పట్టుబడినప్పుడు గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లనివ్వలేదని డీఎస్పీ తెలిపారు.
కేసును అత్యంత వేగంగా ఛేదించిన సీఐ రేవతమ్మ, ఎస్ఐ తారకేశ్వరరావు, కానిస్టేబుల్ మహేష్, హోంగార్డు సంజీవ్లను డీఎస్పీ అభినందించారు.