స్వాతంత్ర్యోద్యమ విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు – యువతకు స్ఫూర్తి ప్రదాత
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు 129వ జయంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్లో శనివారం ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ జ్వాలగా పోరాటాలు నిర్వహించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రాంతంలోని గిరిజనులను సమీకరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపి, తన చివరి శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో యువత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాటాలను నిర్వహించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు.
ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ, దేశ యువతకు అల్లూరి సీతారామరాజు నిత్య స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, 12 ఏళ్లు పూర్తయినా ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. యువత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే పోరాటాలలో అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, శాయన అభిలాష్ కుమార్, గొర్లి స్వాతి, మావూరి విజయ, ఉప్పులూరి లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు.