అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, గిరిజన వాచర్ల సహాయంతో రహస్యంగా తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
అటవీ ప్రాంతంలో జరిగిన ఈ తవ్వకాల సమయంలో రెండు భారీ మట్టి కుండలు బయటపడ్డాయని, వాటిలో బంగారం, వజ్రాలు ఉన్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతోనే అధికారులు తవ్వకాలు చేపట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాల అనంతరం దొరికిన విలువైన వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొదట వాటిని హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించారని, అది సాధ్యంకాకపోవడంతో బెంగళూరులో విక్రయించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలోని యర్రకుంట్ల సమీప అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితమే ఈ తవ్వకాలు జరిగినట్టు సమాచారం. వెలగలపాయ అటవీ బీట్ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అనంతరం గిరిజన వాచర్ల సహాయంతో భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.
తవ్వకాల సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.