గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోబర్ గ్యాస్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో ప్రమాదవశాత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన అజయ్ పండిట్ తన కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం రాఖీ పండుగ సందర్భంగా ఏపూర్ గ్రామంలోని డీఈసీ కంపెనీలో పనిచేస్తున్న తన మామయ్య ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో అజయ్ పండిట్ కుమారుడు ఆర్యన్ కుమార్ (2) క్వార్టర్స్ పక్కన ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు బాలుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కంపెనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గోబర్ గ్యాస్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు గుర్తించారు. గుంతలో బాలుడు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి తండ్రి అజయ్ పండిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. వెంకట్ రెడ్డి తెలిపారు.