గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి హాకీ దిగ్గజం, భారత క్రీడా రంగానికి విశేష సేవలందించిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశానికి క్రీడా రంగంలో విశిష్ట గుర్తింపు తీసుకువచ్చారని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.