మధిర జమియా మసీదుకు మౌలిక వసతులు కల్పించాలి
నూతన షాదీఖానా నిర్మించాలని మున్సిపల్ చైర్పర్సన్కు వినతి
వందేళ్ల చరిత్ర కలిగిన మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం
డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత
మధిర, ఆగస్టు 29:
మధిర పట్టణంలోని చారిత్రాత్మక జమియా మసీదు (మర్కజ్) అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో నూతన షాదీఖానా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శనివారం తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మధిర మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సామినేని సుజాతను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి మాట్లాడుతూ.. వందేళ్ల చరిత్ర కలిగిన జమియా మసీదుకు మధిర పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. అయితే నమాజుకు ముందు వజూ చేసుకునేందుకు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మసీదు ప్రాంగణంలో వజూ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ముస్లిం జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాదీఖానా సరిపోవడం లేదని తెలిపారు. వివాహాలు, శుభకార్యాల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తూ ఆర్థిక భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో కొత్త షాదీఖానా నిర్మాణం చేపడితే పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
వినతిపై మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు సయ్యద్ రసీదు, ఎస్.కె. బాజీ, గౌస్ ఉద్దీన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.