మధ్యవర్తిత్వంతో వివాదాలకు సత్వర పరిష్కారం తిరువూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఏ సింధూర
తిరువూరు: మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం తిరువూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. సింధూర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దనరావు, న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్జి ఏ. సింధూర మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాలను కోర్టుల వరకు తీసుకెళ్లకుండా ఇరుపక్షాల అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వ విధానంలో ఇరుపక్షాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని స్నేహపూర్వక వాతావరణంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరువర్గాల మధ్య సంబంధాలు కూడా కొనసాగుతాయన్నారు. ప్రజలు మధ్యవర్తిత్వ విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దనరావు మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు.
ప్రముఖ న్యాయవాది అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కుటుంబ, ఆస్తి, వ్యాపార తదితర వివాదాల్లో ఇరుపక్షాలు చర్చించుకుని అంగీకారానికి రావడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో న్యాయవాదులు సత్యం, కోట జమలయ్య,సుభాని తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవా కమిటీ సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీలో పాల్గొని మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారంపై ప్రజలకు అవగాహన కల్పించారు.