మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
చిత్తూరు జిల్లా పోలీస్
మిస్సింగ్ వ్యక్తిని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు సురక్షితంగా చేర్చిన ఎన్.ఆర్. పేట పోలీసులు – సేవాభావాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ.
ఎన్.ఆర్. పేట పోలీసుల అప్రమత్తత, మానవతా దృక్పథంతో మిస్సింగ్ వ్యక్తిని గుర్తించి, సంబంధిత పోలీసులతో సమన్వయం చేసుకుని అతని కుటుంబ సభ్యుల చెంతకు సురక్షితంగా చేర్చారు.
కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపూర్ జిల్లా, గుడిబండ ప్రాంతానికి చెందిన ఎన్. రాజేష్ (31) అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక 06-08-2026 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, Cr.No.112/2026 – Man Missing కేసు నమోదైంది.
ఈ క్రమంలో ఎన్.ఆర్. పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం సరిగా లేక సంచరిస్తున్న రాజేష్ను పోలీసులు గుర్తించి సంరక్షణలోకి తీసుకున్నారు. అతని వివరాలను సేకరించిన అనంతరం గుడిబండ పోలీసులను సంప్రదించి, అతను 06-08-2026 నుంచి మిస్సింగ్గా ఉన్న వ్యక్తేనని నిర్ధారించారు.
అనంతరం గుడిబండ పోలీసుల ద్వారా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాజేష్ ఎన్.ఆర్. పేటకు చేరుకోగా, తగిన ధృవీకరణ అనంతరం రాజేష్ను సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తమ కుటుంబ సభ్యుడిని క్షేమంగా గుర్తించి తమకు అప్పగించినందుకు రాజేష్ కుటుంబ సభ్యులు ఎన్.ఆర్. పేట పోలీసులకు, మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఎన్.ఆర్. పేట పోలీసుల అప్రమత్తత, సేవాభావం, మానవతా దృక్పథాన్ని అభినందించారు. ఇతర రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకొని మిస్సింగ్ వ్యక్తిని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు సురక్షితంగా చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజల భద్రతతో పాటు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, మానవతా దృక్పథంతో సేవలందించడం చిత్తూరు జిల్లా పోలీసుల కర్తవ్యమని ఎస్పీ పేర్కొన్నారు.