నాలుగు గంటల్లోనే తప్పిపోయిన మహిళ, ముగ్గురు బాలికలను గుర్తించిన గణపవరం పోలీసులు
కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత.. పోలీసుల వేగవంతమైన చర్యలకు ఎస్పీ అభినందనలు
ఏలూరు జిల్లా గణపవరం పోలీసులు వేగంగా స్పందించి తప్పిపోయిన ఓ మహిళతో పాటు ముగ్గురు బాలికలను కేవలం నాలుగు గంటల్లోనే గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నిడమర్రు మండలం భువనపల్లి గ్రామానికి చెందిన అల్లు శాంతరాజు భార్య అల్లు రాణి (26), కుమార్తెలు అల్లు సిరిహాసిని (10), అల్లు శృతిహర్షిణి (7), అల్లు శ్రేష్ట (4) గత పది రోజులుగా మోయ్యేరు గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గణపవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, నిడమర్రు సీఐ ఎన్. రజని కుమార్ ఆధ్వర్యంలో గణపవరం ఎస్సై ఎ. మణికుమార్, పోలీసు బృందం సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
విస్తృతంగా చేపట్టిన దర్యాప్తులో మహిళ, ముగ్గురు బాలికలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే వారిని సురక్షితంగా గుర్తించి పోలీసుల సంరక్షణలోకి తీసుకున్నారు.
మహిళ, బాలికల ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కుటుంబ సభ్యులకు భద్రంగా అప్పగించారు.
కేసును వేగంగా ఛేదించి మహిళ, చిన్నారులను సురక్షితంగా గుర్తించిన గణపవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ అభినందించారు.
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో గణపవరం పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా 112 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై మణికుమార్ సూచించారు.