రామన్నపాలెంలో హర్ ఘర్ తిరంగా ప్రదర్శన
రామన్నపాలెంలో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో ప్రగతి హైస్కూల్ విద్యార్థులు బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని ప్రగతి హైస్కూల్ నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలోని గాంధీ విగ్రహం, గోసవీడు ప్రాథమిక పాఠశాల వరకు ప్రదర్శన కొనసాగించారు. ఈ సందర్భంగా ‘భారత్ మాతాకీ జై’, ‘ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి’, ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రగతి హైస్కూల్ కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు.
ప్రగతి హైస్కూల్ ఉపాధ్యాయుడు కే. ప్రభాకర్రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో మహనీయులు పాల్గొని తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వివరించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. వెంకటేశ్వర్లు, ఎస్.కె. నర్సరీన్, బి. సూర్యరాణి, జి. ఉమా, జి. రమాకుమారి, కే. మాధవి, కే. కిరణ్కుమారి, బి. శాంతకుమారి, సాయిబాబా కమిటీ సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.