రూ.5 వేల కోట్లతో హైదరాబాద్–బెంగళూరు హైవేకు కొత్త రూపు!
రూ.5 వేల కోట్లతో హైదరాబాద్–బెంగళూరు హైవేకు కొత్త రూపు!
- 176.37 కి.మీ. మేర 4 వరుసల రహదారి 6 వరుసలకు విస్తరణ
- కొత్త భూసేకరణ లేకుండానే బ్రౌన్ఫీల్డ్ విధానంలో అభివృద్ధి
హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు అలైన్మెంట్ ఖరారు.. సెప్టెంబరు చివర్లో కేంద్రానికి డీపీఆర్
3 టోల్ప్లాజాలు.. 8 ప్రధాన, 62 చిన్న జంక్షన్లు.. 86 అండర్పాస్లు
ప్రయాణించిన దూరానికే టోల్.. గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో ప్రయాణానికి అవకాశం హైదరాబాద్: హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి–44 విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కీలక రహదారి అభివృద్ధిపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రస్తుతం ఉన్న 176.37 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల పాక్షిక నియంత్రిత రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు రూ.5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుత రహదారినే విస్తరించే బ్రౌన్ఫీల్డ్ విధానంలో పనులు చేపట్టనుండటంతో కొత్తగా భారీగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. సెప్టెంబరు చివరి వారంలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం నుంచి అనుమతులు లభించిన తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే టెండర్లు పిలిచే సమయానికి నిర్మాణ సామగ్రి ధరలు, వంతెనలు, అండర్పాస్లు, ఇతర మౌలిక సదుపాయాల వ్యయం ఆధారంగా ప్రాజెక్టు అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ఫీల్డ్కు.. మొదట కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మాణంపై దృష్టి సారించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ.. ప్రస్తుత రహదారి పరిస్థితులు, ప్రతిపాదిత మార్గాలపై సమగ్ర సర్వే చేయించింది. ఈ సర్వేలో ప్రస్తుత రహదారికి అవసరమైన 60 మీటర్ల మేర రైట్ ఆఫ్ వే భూమి ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొత్తగా భూసేకరణ చేపట్టి గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించడం కంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రస్తుత నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. రెండు వైపులా సర్వీసు రోడ్లను కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండటంతో బ్రౌన్ఫీల్డ్ విధానానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల భూసేకరణకు పట్టే సమయం, వ్యయం తగ్గడంతో పాటు పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఏర్పడనుంది. కొత్తూరు నుంచి కర్నూలు వరకు.. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కొత్తూరు నుంచి కర్నూలు వరకు ఈ ఆరు వరుసల విస్తరణ చేపట్టనున్నారు. తెలంగాణ పరిధిలో కొత్తూరు, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అన్నాసాగర్, జానంపేట, మూసాపేట, అడ్డాకల్, కనిమెట్ల, బీచుపల్లి, పుల్లూరు మీదుగా రహదారి కర్నూలు వైపు సాగనుంది. మొత్తం 176.37 కిలోమీటర్ల మార్గాన్ని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయడంతో హైదరాబాద్–కర్నూలు మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలకు ఈ మార్గం కీలక రవాణా కారిడార్గా మారనుంది. దూరాన్ని బట్టి టోల్.. ఈ మార్గంలో మూడు టోల్ప్లాజాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ రుసుము వసూలు చేసే సాంకేతికతను వినియోగించే ప్రతిపాదన ఉంది. వాహనం హైవేపైకి ఎక్కే సమయంలో, దిగే సమయంలో ఏర్పాటు చేసే ఆటోమేటిక్ స్కానర్లు ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తాయి. అనంతరం ఆ దూరానికి సంబంధించిన రుసుమును నేరుగా ఫాస్ట్ట్యాగ్ ఖాతా నుంచి మినహాయించే విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు కొంత మేర రుసుము భారం తగ్గనుంది. జంక్షన్లు.. వంతెనలు.. అండర్పాస్లు.. ఆరు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా 8 ప్రధాన జంక్షన్లు, 62 చిన్న జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 10 ప్రధాన వంతెనలు, 74 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 86 అండర్పాస్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే ఉన్న కొన్ని అండర్పాస్లను కొనసాగించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా మరికొన్ని నిర్మించనున్నారు. స్థానిక గ్రామాలు, పట్టణాలకు రాకపోకలు సులభంగా ఉండేలా జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గంలో మూడు రైల్వే క్రాసింగ్లు కూడా రానున్నాయి. గంటకు 120 కి.మీ. వేగం.. ప్రస్తుతం హైదరాబాద్–కర్నూలు మార్గంలో గంటకు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రహదారి ఆరు వరుసలకు విస్తరించి, నియంత్రిత ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, సర్వీసు రోడ్లు, ఇతర భద్రతా సదుపాయాలు అందుబాటులోకి వస్తే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఏర్పడనుంది. దీంతో హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సరకు రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు ఈ విస్తరణ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి చేరిన తర్వాత తుది అంచనా వ్యయం, నిర్మాణ కాలపరిమితి, పనుల ప్రారంభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్–కర్నూలు మార్గం ఆరు వరుసలుగా మారితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.