తిరువూరులో ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహనరంగా ఒక కులానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని, ఆయన ప్రజల్లో ఒక శక్తిగా నిలిచారని కొనియాడారు.
పేదలకు అండగా నిలిచే ఆయన వ్యక్తిత్వం, ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలే ప్రజల హృదయాల్లో ఆయనకు శాశ్వత స్థానాన్ని సంపాదించిపెట్టాయని పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు అర్పించారు.