పెనుగొలనులో స్వామి వివేకానంద వర్ధంతి ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో యుగపురుషుడు, భారతీయ ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు మాట్లాడుతూ భారతీయ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యుగానికి ఒక్కసారే జన్మించే మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.
1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో "అమెరికా సోదరి సోదరులారా" అంటూ ప్రారంభించిన ఆయన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మ వైభవాన్ని చాటిందని తెలిపారు. తన గురువు రామకృష్ణ పరమహంస బోధించిన "మానవసేవయే మాధవసేవ" అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ను స్థాపించిన గొప్ప మానవతావాది స్వామి వివేకానంద అని అన్నారు.
నేటి సమాజంలో యువతకు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనలు అత్యంత అవసరమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి భక్తులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.