వి.బి గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్
రమణక్కపేట, జూలై 4: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలని, వి.బి గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ముసునూరు మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (అయర్లా) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య మాట్లాడుతూ, 2005లో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి ఆకలి సమస్యను నివారించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు.
ఈ చట్టం ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభించి వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా ఊతమిచ్చిందన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వి.బి గ్రామ్ జీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. పని దినాలు పెంచినప్పటికీ నిధులు తగ్గించడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రమణక్కపేట గ్రామంలో కేవలం ఆరు వారాలపాటు మాత్రమే పని కల్పించి ప్రస్తుతం నిలిపివేశారని, ఈ విషయంపై గతంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామీణ కార్మికులకు 125 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.700 కూలీ చెల్లించాలని, పేస్ యాప్ను రద్దు చేయాలని, పారా, తట్టా, పలుగు అలవెన్సులు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నందిపాము రాణి, నందిపాము నవ్య, నందిపాము చిట్టెమ్మ, నందిపాము రాహేలు, ఆముదాల నాగరత్నం, ఆముదాల శాంత, మంద మార్తమ్మ, దారా బేబీ షాలిని, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.