వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు
విస్సన్నపేట, జూలై 4: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయవాది సిరసాని ప్రకాష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు నెక్కలపు కుటుంబరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సిరసాని ప్రకాష్ మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడైన నాయకుడిగా రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
వంగవీటి మోహనరంగా ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని, ఆయన చూపిన మార్గంలో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.