వెలిమినేడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీరేశం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ అభివృద్ధికి అంచలంచలుగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసన సభ్యుడు వేముల వీరేశం అన్నారు. శనివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో సుమారు కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. సీఎం గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టే నాటికి ఉన్న అప్పుకు ప్రతినెల 6000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టడం జరుగుతుందని దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించలేని దీనస్థితిలో ఉండేదన్నారు. అట్టి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశాడన్నారు. ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. హైదరాబాదులో రెండవ పేస్ మెట్రో రైలు విస్తరణకు ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థ ముందుకు రాకపోతే సీఎం వారితో మాట్లాడి నష్టాలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చి తక్కువ వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి సెకండ్ ఫేస్ మెట్రో పనులను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. వెల్మినేడు గ్రామంలో పేరుకుపోయిన మౌలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని వెలిమినేడు నుండి వెల్లంకి, సిరిపురం వెళ్లేందుకు రోడ్డు నిర్మాణ పనులకు త్వరలోనే ప్రతిపాదనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయంలో ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య, పాలకవర్గ సభ్యులు కిరణ్ కుమార్, చింతకింది వెంకటేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, నాయకులు అంతటి నరసింహ, పిశాటి భీష్మారెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..