ఇకపై ఏపీలో రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. రైతులకు భారీ ఊరట
అమరావతి, జూలై 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాత, తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వ్యవసాయ భూములను వారసుల పేర్లకు మార్చుకునే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు కేవలం రూ.100 స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. భూమి విలువ రూ.10 లక్షలకు మించి ఉంటే రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఆటో మ్యుటేషన్ విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలు స్వయంచాలకంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదవుతాయి. దీంతో రైతులు, వారసులు మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోనుంది.
ఈ నిర్ణయంతో వారసత్వ భూముల బదిలీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వారసత్వ హక్కుల నమోదు మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది.