తునికిపాడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం
తునికిపాడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం, ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ ఐపీఎస్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
వినాయక చవితి వంటి పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తునికిపాడు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో పోలీసులు మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన అంశాలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు, స్థానిక ఎస్సై జి. అనిల్, తిరువూరు ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.