వెలిమినేడు కంపెనీలపై జెన్జీల ఆగ్రహం
వెలిమినేడు కంపెనీలపై జెన్జీల ఆగ్రహం : కంపెనీల హెచ్ఆర్లను నిలదీసిన వెలిమినేడు జెన్జీ యువత
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని వివిధ కంపెనీల హెచ్ఆర్లతో వెలిమినేడు జెన్జీ ప్రతినిధులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశo నిర్వహించారు. గ్రామంలో కంపెనీల కార్యకలాపాల వల్ల తలెత్తుతున్న సమస్యలపై యువత కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ, స్థానికులకు ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టుల్లో గుత్తాధిపత్యాన్ని నివారించడం, కంపెనీలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లను జెన్జీ ప్రతినిధులు కంపెనీ హెచ్ఆర్ల ముందు ఉంచారు. కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న అంశాలను కూడా ఈ సందర్భంగా యువత ప్రస్తావించింది. అలాగే
కాలుష్య సమస్యపై కూడా ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. కంపెనీల నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని యువత ఆవేదన వ్యక్తం చేసింది. కాలుష్యంపై అడిగిన ప్రశ్నలకు కంపెనీ ప్రతినిధులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని జెన్జీ ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటికే కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించామని, తమ వద్ద పూర్తి సమాచారం ఉందని జన్ జీ ప్రతినిధులు అన్నారు. సీఎస్ఆర్ నిధుల విషయంలోనూ గ్రామానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించింది. కంపెనీల లాభాల్లో సీఎస్ఆర్ కింద కేటాయించాల్సిన నిధులపై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆగస్టు 17 వరకు గడువు
తాము లేవనెత్తిన అంశాలపై కంపెనీ యాజమాన్యాలతో చర్చించి సమాధానం ఇస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇందుకు ఆగస్టు 17 వరకు జెన్జీ డెడ్లైన్ విధించింది. అప్పటిలోగా కంపెనీల నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జెన్జీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, జెన్జీ స్థాపకులు పోలగోని శివప్రసాద్, బిల్లపాటి లింగారెడ్డి, అంతటి సత్తయ్య, దేశబోయిన నర్సింహ, బైకాని నాగరాజుతో పాటు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.