వందేమాతరం గీతం జాతిని ఏకం చేసిన మహామంత్రం: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలో శనివారం ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని వందేమాతరం పూర్తి గీతం పోస్టర్లు, ప్యాకెట్ కార్డులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలో అసేతు హిమాచలాన్ని ఏకం చేసిన మహామంత్రం "వందేమాతరం" అని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి వెలువడిన ఈ మహోన్నత గీతం భారతీయుల్లో దేశభక్తిని రగిలించిందని, ఆ గీతం ఆవిర్భవించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు వందేమాతరం పూర్తి గీతం పాడే పోటీలను ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేస్తానని తెలిపారు.
ప్రజ్ఞ భారతి ప్రతినిధులు మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు వందేమాతరం పూర్తి గీతం ప్యాకెట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు పాఠశాలల్లో పోస్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ భారతి చైర్మన్ రాజ భాస్కర రెడ్డి, సముద్రాల నాగేశ్వరరావు, మందల నాగేశ్వరరావు, వెచ్చా మురళి, జె. సత్యనారాయణ రెడ్డి, డి. శ్రీనివాస్, సీఏఓ నిరంజనాచారి, యలగందల సత్యనారాయణ, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.